స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానాయకుడు సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా గురించి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినిమాలో తన పాత్రను విలన్ గా చూపించారని సినిమా చూసిన వారంతా ఇదే చెబుతున్నారని మండిపడ్డారు. అసలు విలన్ చంద్రబాబు నాయుడే అని ఆయన అన్నారు. నిజాలు చెప్పేంత ధైర్యం వారికి లేదంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా అప్పటి పరిస్థితులను మరోసారి గుర్తు చేశారు నాదెండ్ల. తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకొమ్మని చంద్రబాబు నాయుడు తన వద్దకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకులు ఆయన కుటుంబ సభ్యులే అని.. ఎన్టీఆర్ ను తీవ్రంగా క్షోభ పెట్టింది వారేనన్నారు. ఆయన తిండికంటూ కొంత సొమ్మును తన దగ్గర ఉంచుకుంటే ఆ విషయంలోనూ కోర్టుకు వెళ్లారని.. ఆయన ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా చేసి హింసించారని అన్నారు. ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతి సపర్యలు చేసిందని.. ఆయన గెలిచాకా.. మళ్లీ ఆయన చుట్టూ చేరారన్నారు. అసలు నిజాలు చూపించకుండా వెండితెరపై ఈ విధంగా సినిమాని రక్తికట్టించడం కోసం ఇతర పాత్రలను దుర్బుద్ధి గా వాడటం మంచిది కాదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో సినిమా యూనిట్ కి నోటీసులు పంపించినట్లు నాదెండ్ల తెలిపారు.