ఆంధ్రాలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికలలో పోటీకి నిలబడే అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2014 ఎన్నికలలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో గెలుస్తామని ధీమా తో ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో పార్టీ తరఫున నిలబడే అభ్యర్థుల విషయంలో తప్పటడుగులు వేసిన జగన్ ఈసారి 2019 ఎన్నికలకు చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తన రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఎన్నికలకు పోటీ కి నిలబడే అభ్యర్థుల గురించి సదరు నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న విషయాన్ని తెలుసుకోవడానికి సర్వే నిర్వహించారు.
జిల్లాల వారీగా నిర్వహిస్తున్న ఈ సర్వే తాజాగా కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీలో కీలకంగా ఉండే నాయకుడు అయిన కొడాలి నాని గురించి వచ్చిన ఫలితం వైసిపి అధిష్టానంతో పాటు పార్టీ క్యాడర్ కూడా షాక్ తింది. ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని పై తీవ్ర వ్యతిరేకత ఉందని వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని సర్వేలో తేలిందని ఈ వార్త తాజాగా సోషల్ మీడియాలో బయటకు వచ్చింది.
అయితే ఈ వార్తలను వైసీపీ నేతలు కొట్టి పడేస్తున్నారు. ఎన్నికల కోసం జగన్ సర్వే చేయించింది నిజమే అయినా.. ఆ సర్వేకి సంబంధించిన ఫలితాలు ఇప్పటి వరకు వైసీపీ నేతలకే తెలియదని.. అలాంటిది కొడాలి నాని పై వ్యతిరేకత వచ్చిందని ఎలా చెబుతారని వైసీపీ శ్రేణులు మండి పడుతున్నారు. వైసీపీ అధినేత జగన్తో పాటు టీడీపీకి చమటలు పట్టిస్తున్న వైసీపీ నేతల్లో కొడాలి నాని ఒకరని.. గుడివాడలో కొడాలి నానికి ఉన్న క్రేజ్ను ఎలాగైనా తగ్గించాలని టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో ఆడుతున్న డ్రామాలు అని వైసీపీ నేతలు అంటున్నారు. అసలు గుడివాడ అంటేనే కొడాలి నాని అని కొడాలి నాని అంటేనే గుడివాడ ని ఆ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో మళ్లీ కొడాలి నాని దే గెలుపని పేర్కొంటున్నారు.