ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు పెన్షన్ పెంచడంపై వైసీపీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ కీ భయపడే చంద్రబాబు వృద్ధులకు పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారని.. ప్రజల మీద ప్రేమతో కాదని పేర్కొన్నారు. తాజాగా ఇటీవల శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు వచ్చాయె కనుకే చంద్రబాబు తాయిలాలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. విభజన సమస్యలు కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబుకు గుర్తు రాలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం చంద్రబాబు ఏం చేశారు? ప్రజల సమస్యలపై 9ఏళ్లుగా పోరాడుతోంది ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే.
చంద్రబాబు పాలనంతా మోసపూరితం. ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులే బయటకు వచ్చి చంద్రబాబు దోపిడీ గురించి మాట్లాడుతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిలా ఫలానా సంక్షేమ కార్యక్రమాన్ని చేశానని ధైర్యంగా చంద్రబాబు చెప్పగలరా? అని ఆయన అన్నారు. అసెంబ్లీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకు తాము సభకు వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడితే మైకులు కట్ చేసే సంస్కృతి చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే పాలకపక్షం పట్ల రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.