ఇటీవల వైసీపీ పార్టీ అధినేత జగన్ ఢిల్లీలో ఎలక్షన్ల విషయంలో అధికార పార్టీ టిడిపి కొన్ని అవకతవకలకు పాల్పడుతుందని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఒకే సామాజికవర్గానికి చెందిన ముప్పైఐదు మందికి పోలీసు శాఖలో ప్రమోషన్ లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. దీంతో విపక్ష నేత జగన్ చేసిన ఆరోపణపై డిజిపి ఆర్.పి ఠాకూర్ స్పందించిన వార్త మీడియాలో వచ్చింది. పోలీసులకు కులం ఉండదని, తమది ఖాకీ బలం అని ఆయన అన్నారు.
హైకోర్టు ఆదేశం ప్రకారం మెరిట్ ప్రకారం ప్రమోషన్లు ఇచ్చామని ఆయన అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం వివరణ అడిగితే జవాబు ఇస్తామని ఆయన అన్నారు. తాను నిజాయితీగా పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. ఎసిబి డిజిపిగా కూడా పనిచేశానని అన్నారు. ఒకే కులం వారికి ప్రమోషన్లు ఇచ్చింది వాస్తవమే కాని, అది మెరిట్ ప్రకారం ఇచ్చినట్లుగా డిజిపి చెబుతున్నారన్న భావన కలుగుతుంది. మొత్తంమీద జగన్ చంద్రబాబు కి సంబంధించిన సామాజిక వర్గం పై చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించాయి. ఈ క్రమంలో కొంతమంది సీనియర్ నాయకులు జగన్ అనడంలో తప్పేమీ లేదని తమ అభిప్రాయాలను బాహాటంగానే తెలియజేస్తూ జగన్ కి మద్దతు తెలుపుతున్నారు.