వైసీపీ పార్టీ అధినేత జగన్ పై విశాఖపట్టణం విమానాశ్రయంలో హత్య చేయడానికి ప్రయత్నించిన శ్రీనివాస రావు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో అష్ట కష్టాలు పడుతూ కటకటాలు లెక్కపెడుతున్నాడు. శ్రీనివాసరావు జైల్లో ఒంటరితనం భరించలేక తాను ఉంటున్న చిన్నగదిలో నానా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా తనను బయటకు తీసుకు రావాలని జైల్లో ఉండలేకపోతున్నాను అంటూ తెగ ప్రాధేయ పడుతున్నట్లు టాక్. దీంతో శ్రీనివాసరావు లాయర్ అబ్దుల్ సలీమ్ ఈ విషయాలను మీడియాకు తెలియజేశారు.
ఓ రోజు తనకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఫోన్ వచ్చిందని.. శ్రీనివాసరావు తనను బెయిల్పై బయటకు తీసుకురావాలని కోరుతున్నాడని ఆ ఫోన్ సారాంశమని అబ్దుల్ తెలిపారు. శ్రీనివాసరావు బయట ప్రపంచంలో తిరిగితే తన ప్రాణానికి ప్రమాదమనే ఇన్ని రోజులు బెయిల్ కోసం అప్లై చేయలేదని.. కానీ ఇప్పుడు తన ఉద్దేశం మార్చుకున్నానని అబ్దుల్ అన్నారు. శ్రీనివాసరావులో డిప్రెషన్, ఫ్రస్టేషన్ పెరుగుతున్నందు వల్లే ఇలా చేస్తున్నాడు కావచ్చు అంటూ ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ శుక్రవారం కానీ.. లేదా సోమవారం కానీ ఎన్ఐఏ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తానన్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 8తో శ్రీనివాసరావుకు ఎన్ఐఏ రిమాండ్ ముగియనుంది. కానీ ఫిబ్రవరి 22 వరకు రిమాండ్ను పొడిగించే అవకాశం ఉంది.