అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారం చేసుకుని చేసిన యాత్ర సినిమా ఆయన సతీమణి విజయమ్మ ఇటీవల తిలకించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. యాత్ర సినిమాను చాలా బాగా తీశారని చెప్పారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారు.
వైఎస్సార్ సజీవంగా మనముందు లేకపోయినా... యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసం వైఎస్సార్ కట్టుబడేవారని ఆమె వ్యాఖ్యానించారు. సినిమాలో ప్రజల భావోద్వేగాలను వైయస్ నాయకుడి లక్షణాలను అద్భుతంగా చూపించారని ప్రజల కష్టాలకు నాయకుడు స్పందించే విధానం తీసుకునే నిర్ణయాలు కళ్ళకి కట్టినట్లుగా అద్భుతంగా చూపించారని పేర్కొన్నారు.