ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకపక్క ప్రత్యేక హోదా అంటూ ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చంద్రబాబు చేస్తుంటే మరోపక్క జగన్ ప్రతి జిల్లాల్లో సభలు పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అనంతపురం జిల్లాలో సమర శంఖం సభ నిర్వహించిన జగన్ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధం గా వ్యవహరిస్తారు వంటి విషయాలను ప్రజలకు తెలియజేశారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రతీ ఓటరుని డబ్బులతో కొనెయ్యాలని చూస్తున్నారని,అందుకనే ప్రతీ ఒక్క ఓటుకి మూడు వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు మూడు వేలు తీసుకొని మోసపోకండి,రేపు నేను ముఖ్యమంత్రి అయ్యాక అమ్మ ఒడి పథకంలో భాగంగా ప్రతీ విద్యార్థిని పంపిన తల్లికి 15వేల రూపాయలు ఇస్తానని జగన్ తెలిపారు. అందుకని ఏ ఒక్కరు బాబు ఇచ్చే 3 వేల రూపాయలకి ప్రలోభపడవద్దు అని ఆ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. రాబోయే వి మంచి రోజులని ప్రజలకు భరోసా ఇస్తూ ప్రతి వ్యక్తిని కుటుంబాన్ని సామాజికంగా రాజకీయంగా పైకి లేవనెత్తుతానని ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఎవరు మోసపోకూడదు అని జగన్ పిలుపునిచ్చారు.