తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల టిడిపి కార్యకర్తలతో మరియు నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ప్రధాని మోడీ ని మరియు కెసిఆర్ ని విభేదిస్తే జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. వాళ్ళిద్దరినీ కాదనలేని పరిస్థితుల్లో జగన్ ఉండిపోయారని అందుకే రాష్ట్రాన్ని మోసం చేసిన మోడీని ఏమీ అనలేక పోతున్నారని పక్క తెలుగు రాష్ట్రం సీఎం కెసిఆర్ సహకరించ లేని నేపథ్యంలో ఆయనతో కూడా జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఇటువంటి దారుణమైన స్థితి లో జగన్ ఉన్నారని ఇద్దరిలో ఎవరిని వదిలినా జగన్ వెంటనే జైలుకు వెళ్లక తప్పదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదన్నదే జగన్, కేసీఆర్, మోదీల ఆలోచన అని అన్నారు. ఈ ముగ్గురి కుట్రలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు టెలీకాన్ఫరెన్స్ సందర్బంగా బాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ను మించిపోయేలా అమరావతిలో అభివృద్ధి జరిగితే, తమకు మనుగడకు ఎక్కడ ప్రమాదం వాటిల్లుతుందో అన్నది వీరిలోని భయమని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తన తాపత్రయం అని, అందుకోసమే కేంద్రంతో యుద్ధం చేస్తున్నానని అన్నారు, ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనకు ప్రజలు సహకారం అందించాలని కోరారు.