ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న లగడపాటి రాజగోపాల్ ఆ సమయంలో అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గత కొంతకాలంగా శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నా లగడపాటి రాజగోపాల్ సర్వేలు చేయడం మాత్రం మానలేదు. సర్వేలలో ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఫలితాలు చెప్పిన క్రమంలో సర్వేల విషయంలో కొంత దెబ్బతిన్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల తేదీ ప్రకటించడంతో త్వరలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన వార్తలపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. తాను పోటీ చేస్తానని వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు. నర్సరావుపేటతో సహా ఏ నియోజకవర్గంపైనా తాను చర్చలు జరపలేదని, ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తాను ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. తాను అసలు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.