ఆంధ్రరాష్ట్రం అంతటా ప్రస్తుతం రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల అధ్యక్షులు ప్రజలలో ఉంటూ మరోపక్క తమ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ తెలుగుదేశం మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూసుకెళ్ళిపోతున్న నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీ రంగంలోకి దిగింది.
ఇటీవల రాయలసీమ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించి రాయలసీమ ప్రాంతంలో కూడా తనకు సత్తా ఉందని తెలియజేసిన పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికలలో ఉత్తరాంధ్ర ను ప్రభావితం జేసే విధంగా విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధమైనట్లు టాక్ వినపడుతోంది. గాజువాక నుండి పవన్ పోటీ దాదాపు ఖరారయ్యిందని, ఇక ప్రకటించటమే మిగిలి ఉందని అంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా విశాఖ నుండి పోటీ చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో... ఈ ఇద్దరు యువ నేతలు కళ్ళు విశాఖ పై పడటంతో...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల చూపు మొత్తం విశాఖపట్టణం పై పడింది.