ఎన్నికల్లో పోటీకి దిగకముందే టిడిపికి భారీ దెబ్బ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీల రాజకీయ నేతలు నామినేషన్ల ఘట్టాన్ని ముగించుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంగం దాఖలైన నామినేషన్ల అభ్యర్థుల పత్రాలను వారు పేర్కొన్న సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించే కార్యక్రమం మొదలు పెట్టింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం జిల్లా కురపాం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయడానికి సిద్ధమై నామినేషన్ వేసిన జనార్ధన్ ధాట్రాజ్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి.
ఎన్నికల సంఘానికి ఇచ్చిన నామినేషన్ పత్రం లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఎన్నికల అధికారులు పోటీకి జనార్ధన్ ధాట్రాజ్ అనర్హుడని తేల్చేశారు. అంతకు ముందు స్క్రూటినీ జరుగుతున్న సమయంలో జనార్ధన్ నామినేషన్ పత్రాల్లో తన వర్గం ఎస్టీ అని పేర్కొన్నారు. గమనించిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు జనార్ధన్ అసలు ఎస్టీ కాదని, అందుకు సంబంధించిన హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన పత్రాలను సైతం ఎన్నికల అధికారులకు చూపించారు. ఆ పత్రాలపై జనార్ధన్ ఎస్టీ కాదని కోర్టులు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉండటంతో అతని నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. దీంతో మరో టీడీపీ నేత ఎవ్వరూ కూడా డమ్మీ నామినేషన్లు వేయకపోవడంతో స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు తెలిపేందుకు టీడీపీ అధిష్టానం యోచిస్తోంది.