ఆలీ లాంటి వాళ్ళు ఉండబట్టే మనుషులను నమ్మలేకపోతున్నా: పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాజమండ్రి నగరంలో నిర్వహించిన సభలో సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి అత్యంత స్నేహితుడు మరియు సన్నిహితుడు అయిన ఆలీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ వంటి వ్యక్తుల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని అన్నారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నానని, తనతో కలిసి పనిచేస్తానన్న అలీ చెప్పకుండానే వైకాపాలోకి వెళ్లిపోయారన్నారు. అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్ ఇచ్చినా తనను వదిలి వెళ్లాడని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎన్నికల్లో రాణించలేనని ఎలా అనుకుంటారని, ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ సినిమాతో స్టార్ అవుతానని ఎవరైనా అనుకున్నారా అని పవన్ ప్రశ్నించారు.
అవసరంలో తాను ఆదుకున్న అలీ లాంటి వాడే వదిలేస్తే ఇంకా ఎవరిని నమ్మాలన్నారు. అలీ లాంటి వారి వల్ల.. ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదన్నారు. ఇదే క్రమంలో వైసిపి పార్టీ అధినేత జగన్ పై కూడా విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. రాబోతున్న ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓటర్లను కొనటానికి జగన్ ప్రతి ఒక్క ఓటర్ కి రెండు వేల రూపాయలు ఇస్తున్నారని...ఆరోపించారు. మరియు అదే విధంగా జగన్ ఆలీ ని కూడా వాడుకొని వదిలేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. ఈ క్రమంలో జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఎవరు ఎవరిని వాడుతున్నారో.. రాజకీయాలలో వాడుకోవడం ఎవరికి తెలుసో నిన్ను ఎవరు వాడుతున్నారో అందరికీ తెలుసు అంటూ చీకట్లో మిత్ర బంధం పాటిస్తూ ప్రజల ముందు నాటకాలు ఆడటం నీకే చెల్లుతుంది అంటూ పవన్- చంద్రబాబు బంధాలపై పరోక్షంగా సెటైర్లు వేశారు వైసిపి పార్టీ నేతలు. ఇందుమూలంగా నే రాష్ట్రంలో 175 స్థానాల్లో కేవలం అరవై ఐదు స్థానాలలో నే జనసేన అభ్యర్థులను నిలబెట్టి చంద్రబాబు కి మంచి చేయడానికి తీవ్ర కృషి చేస్తున్నావు బాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అని సెటైర్లు కూడా వేస్తున్నారు.