జగన్ గెలవడం వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హస్తం ఉంది అంటున్న కే ఏ పాల్..!
ఆంధ్రాలో ఎన్నికలు సీరియస్ గా జరుగుతున్న తరుణంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పెట్టిన ప్రెస్ మీట్ లు పాల్గొన్న డిబేట్ లు అందరికీ నవ్వు తెప్పించాయి. ముఖ్యంగా తాను అధికారంలోకి వస్తే ఆంధ్రను అమెరిక చేస్తానంటూ హామీలు ఇస్తూ ఇతర పార్టీల నేతలపై అనేక విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలు మరో 40 రోజుల్లో వస్తున్న తరుణంలో కే ఏ పాల్ వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ గుళ్లు గోపురాల చుట్టూ తిరుగుతున్నాడని మాట్లాడుతూ...తాజాగా 2019 ఎన్నికల్లో వాడిన ఈవీఎంలలో రష్యన్ చిప్ ఉందని కే.ఏ.పాల్ అనుమానాలను వ్యక్తం చేశారు. అసలు ఏపీ ఎన్నికలు జరిగిన తీరు చట్ట విరుద్దమని కే.ఏ.పాల్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించిన ఈవీఎంలలో రష్యన్ చిప్లు ఉన్నాయని, వైసీపీ అధినేత వైఎస్ జగన్ను గెలిపించడానికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈవీఎంలను ప్రత్యేకంగా తయారు చేయించి పంపించారని, ఆ క్రమంలోనే సర్వేలన్నీ కూడా వైఎస్ జగన్కు అనుకూలంగా రావడం జరిగిందని కే.ఏ.పాల్ ఆరోపించారు. ఈవీఎంలలో తాను చెబుతున్న మాటలను చంద్రబాబు ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారని కే.ఏ.పాల్ అన్నారు. దీంతో తాజాగా కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.