శ్రీలంక లో ఎమర్జెన్సీ తమిళనాడులో కూడా హై అలర్ట్..!
తాజాగా ఇటీవల ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో క్రైస్తవులను టార్గెట్ చేస్తూ మరియు శ్రీలంక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉగ్రవాదులు చర్చీలలో మరియు హోటళ్లలో బాంబుల వర్షం కురిపించారు. శ్రీలంకలో జరిగిన ఈ మారణహోమం ప్రపంచ దేశాలను కలచివేసింది. ఎంతోమంది అమాయకులను ఈ ఘటనలో ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. దీంతో దేశంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షులు మైత్రిపాల సిరిసేన సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించాలని ఆయన నిర్ణయించారు. అంతేకాకుండా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఎమర్జెన్సీని ప్రకటించనున్నారు. ఈ అర్థరాత్రి నుంచే శ్రీలంకలో ఎమర్జెన్సీ అమలులోకి రానుంది. ఇక, తమిళనాడు తీర ప్రాంతంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు సముద్రమార్గాన తమిళనాడు వైపు వచ్చే అవకాశం ఉన్నందున తీరప్రాంతాన్ని అప్రమత్తం చేశారు.