ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా తన సొంత ఖర్చులతో కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి హోదాలో తొలి విదేశీ పర్యటన గా ఇజ్రాయిల్ దేశం వెళ్లారు. ఈ క్రమంలో తర్వాత జగన్ తాజాగా ఇప్పుడు అమెరికా పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటనలో కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు ఏపీ సీఎం కార్యాలయం తాజాగా వెల్లడించింది.
సీఎం అమెరికా పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం కార్యాలయం ఇటీవల వెల్లడించింది. పర్యటనలో మూడు రోజులు వ్యక్తి గత పనులు ఉండటం వల్ల సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకోకుండా తానే భరించనున్నారు.
♦ ఆగస్టు 16, ఉదయం 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) వాషింగ్టన్ డీసీకి చేరతారు. అదేరోజు అమెరికా రాయబారితో, అమెరికా– ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.
♦ ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
♦ ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు.
♦ ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనుల్లో ఉంటారు.
♦ ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారు.