దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా అప్పట్లో విడుదల అయ్యి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై కుట్ర జరిగినట్లు వార్తలు కొన్ని బయటకు వచ్చాయి. మేటర్ ఏమిటంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో స్టార్ మా ఛానల్ లో యాత్ర సినిమా వేయవద్దని చాలా ఒత్తిడి వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఇటీవల స్టార్ మా లో బిగ్ బాస్ 3 సీజన్ ప్రారంభం కాబోతున్న క్రమంలో శ్వేతారెడ్డి అనే యాంకర్ ఆ చానెల్ ఉద్యోగులు కొందరి మీద ఆరోపణలు చేసారు. బిగ్ బాస్ 3 సెలక్షన్ల వెనుక కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలున్నాయని ఆరోపించారు. ఈ విషయమై వెంటనే ఓ పత్రికలో కాస్త ప్రముఖంగా ఆ వ్యవహారాన్ని ప్రచురించారు. అలాగే అదే పత్రిక వెబ్ సైట్ లో కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. అక్కడితో ఆగకుండా ఈ వ్యవహారంపై వారి ఛానెల్ లో డిస్కషన్ కూడా పెట్టారు. ఈ విషయమై స్టార్ మా వర్గాల నుంచి ఓ చిత్రమైన సమాచారం తెలుస్తోంది. ఈ బిగ్ బాస్ గడబిడను అంతగా పట్టించుకోవద్దని ఆ చానెల్ నిర్వాహకులకు 'మనం మనం మీడియా' కదా అనే యాంగిల్ లో రిక్వెస్ట్ వెళ్లిందట. దానికి ఆ చానెల్ నుంచి చిత్రమైన సమాధానం వచ్చిందని తెలుస్తోంది. 'మేం ఎన్నికల ముందు యాత్ర సినిమా వేయవద్దు అంటే మీరు ఆపారా? లేదుకదా?' అన్నది ఆ సమాధానంగా తెలుస్తోంది. దీంతో ఈ వార్త ఇప్పుడే బయటకు రావడంతో ఈ విషయం మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.