సీబీఐ పై పోరాటానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సుజనా చౌదరి..!
మాజీ కేంద్ర మంత్రి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పై ఇటీవల కేంద్ర నిఘా సంస్థ సీబీఐ దాడులు చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టిన నేపథ్యంలో సిబిఐ సుజనా చౌదరి కి సంబంధించిన కంపెనీలపై మరియు నివాసంపై ఇటీవల దాడులు చేయడంతో ఈ విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో సీబీఐ సుజనా చౌదరి ని విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. అయితే సుజనా చౌదరి సిబిఐ విచారణకు గైర్హాజర్ కావడంతో మరోసారి నోటీసు పంపింది.
వచ్చే నెల నాలుగో తేదీన హాజరు కావాలని సిబిఐ కోరింది. అయితే దానిపై ఆయన హైకోర్టుకు వెళ్లారని కధనం. రుణాల ఎగవేత, నిధులు మళ్లింపుపై బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ కంపెనీకి చెందిన ఆరుగురిపై 2017లో సీబీఐ కేసు నమోదు చేసిందని.. ఆ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ తనను విచారించేందుకు పిలిపించడం సరికాదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దోషులను గుర్తించడం సీబీఐ బాధ్యత అని, కానీ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా తనకు నోటీసు ఇవ్వడం సరికాదని ఆయన వాదిస్తున్నారు.