ఏపీ కి కాబోయే ముఖ్యమంత్రి జగన్ కి సలహాలు ఇచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మే 30 వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైసీపీ పార్టీ అధినేత జగన్ కి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఇటీవల ప్రధాని మోడీ ని కలిసి ఢిల్లీలో జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై ఆయన చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన విధానం పై జగన్ తన తండ్రి మాదిరిగా వ్యవహరిస్తున్నారని పోల్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నైజం కలిగిన నాయకుడని జగన్ కూడా అదే పంథాను పోతున్నారని తండ్రిలాగానే ఏదీ దాచుకుండా మాట్లాడారని, ఇదే పద్దతి ఆయన కొనసాగించాలని ఉండవల్లి అన్నారు.
టెండర్లకు సంబందించి జగన్ చేసిన ప్రకటన విప్లవాత్మక మార్పునకు నాందీ అని ఆయన పేర్కొన్నారు.ఎన్నికలలో ఓట్లకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయవలసి వచ్చిందని,పాతిక ఎకరాల పొలం ఉన్న రైతులు కూడా డబ్బు ఇవ్వవలసి వచ్చిందని ఒక నేత చెప్పారని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అవినీతి రహిత ప్రభుత్వం తెస్తానని అనడం విశేషమని, ఇందుకు ముందుగా ఎమ్మెల్యేలను ,ప్రజలను ఒప్పించాలని ఆయన సూచించారు. వచ్చే ఎన్నికల నాటికి డబ్బిచ్చే వాళ్లు ఓడిపోతారన్న అబిప్రాయప రావాలని ఆయన అన్నారు. రాజకీయం అనేది ఒక వ్యసనం అని, పెట్టుబడి పెట్టి డబ్బు లాగాలని వచ్చేవారు తక్కువ అని ఆయన అన్నారు. ముందుగా ఇసుక మాఫియాను అపాలని ఆయన సూచించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఇసుకలో పాతిక శాతం కూరుకుపోయిందని ఉండవల్లి అన్నారు. ఎన్నికల తర్వాత గెలిచి చెప్పిన ముఖ్యమంత్రి ఎవరూ ఇంత గట్టిగా చెప్పలేదని, అందువల్ల జగన్ దీనిపై అందరితో మాట్లాడి చేయాలని ఆయన అన్నారు. అజయ్ కల్లాం ను సలహాదారుగా పెడుతున్నారని వార్తలు వచ్చాయని, ఆయన అవినీతిని ఒప్పుకోరని, అలాంటి వ్యక్తిని పెట్టుకోవడం కూడా మంచి పరిణామమని ఉండవల్లి అన్నారు. పోలవరం గురించి మాట్లాడడం కూడా బాగుందని ఆయన అన్నారు .జూలైనాటికి నీళ్లు వస్తాయని, వైఎస్ నాటి నిపుణులతో మాట్లాడి సలహాలు తీసుకోవాలని కూడా ఉండవల్లి తెలిపారు.దీర్ఘకాలిక వ్యూహంతో మాట్లాడాలని ఆయన అన్నారు. ఎపిలో ఏభైశాతం ఓట్లు రావడం కూడా జగన్ ప్రత్యేకత అని ఆయన అన్నారు.