పోలవరం ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..!
ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు ఎలాగైనా పూర్తి చేయాలని ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ పోలవరం ప్రాజెక్టు విషయమై అన్ని విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసి తన తండ్రి వైఎస్సార్ కలను నెరవేర్చి రాష్ట్రంలో ఉన్న రైతుల ముఖంలో ఆనందం చూడాలని జగన్ తెగ ఆరాటపడుతున్నట్లు వైసీపీ పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఇటువంటి క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు సకాలం లో నిధులు కేటాయించి సత్వరమే పూర్తి అయ్యేలా చూడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తనను కలిసిన సందర్భంగా ఈ అంశం ప్రస్తావించారు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లోని కరవు ప్రాంతాలకు సాగు, తాగు నీరందించేందుకు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమని అన్నారు. గోదావరి, పెన్నా నదుల అనుసందానం జరగాలని సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఆ మొత్తాన్ని నాబార్డు ద్వారా విడుదల చేయించేందుకు అవసరమైన చొరవ తీసుకోవాలన్నారు. నిధుల్లేక పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కాకూడదన్నదే తన ఆకాంక్ష అన్నారు. ప్రాజెక్టు విస్తరణ విషయంలో అడ్డంకుల్ని తొలగించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఇందుకు సానుకూలంగా మంత్రి స్పందించారు.